Telangana: కామెర్లు వచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్తే.. శిశువునే మాయం చేశారు!

  • సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఘటన
  • శిశువును మరో మహిళకు అప్పగించిన ఆయా
  • ఆసుపత్రిలో బాధిత మహిళ కుటుంబ సభ్యుల ఆందోళన

పది రోజుల క్రితం పుట్టిన శిశువుకు పచ్చకామెర్లు వచ్చాయని ఆసుపత్రికి తీసుకెళ్తే శిశువునే మాయం చేసిందో ఆయా. సంగారెడ్డిలో జరిగిందీ ఘటన. కల్పగూర్ గ్రామానికి చెందిన హన్మోజిగారి మాధవి(28) గత నెల 30న జిల్లా ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 3న బిడ్డకు పచ్చకామెర్లు రావడంతో తిరిగి ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు శిశువును ఎస్‌ఎన్‌సీయూలో ఉంచారు. మంగళవారం ఉదయం గుర్తుతెలియని మహిళ ఎస్‌ఎన్‌సీయూలోకి వచ్చింది.

అక్కడే ఉన్న ఆయా వనిత ఆమెను మాధవిగా భావించి బిడ్డను ఆమెకు అప్పగించింది. ఆ తర్వాత కాసేపటికి బిడ్డను చూసేందుకు వెళ్లిన మాధవికి అక్కడ చిన్నారి కనిపించకపోవడంతో ఆయాను ప్రశ్నించింది. ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గట్టిగా నిలదీసింది. ఆసుపత్రి మొత్తం గాలించినా బిడ్డ కనిపించకపోవడంతో మాధవి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్‌ పగలగొట్టారు.

ఆసుపత్రిలోని ఆర్‌ఎంఓ ఛాంబర్‌లో సీసీ ఫుటేజీలను పరీక్షించగా బిడ్డను ఓ గుర్తు తెలియని మహిళ బయటకు తీసుకెళ్తున్నట్టు రికార్డైంది. జిల్లా వైద్యాధికారి మోజీరాం రాథోడ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయా వనితను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News