Hazipur: గత నెల 21న కనిపించిన యువతి మృతదేహం... మానవమృగం శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలేనని అనుమానం!

  • అగ్రహారం గుట్టల్లో యువతి శవం
  • వేములవాడ ప్రాంతంలో యువతిని ప్రేమించానన్న శ్రీనివాస్
  • మృతదేహం ఎవరిదో తేల్చే ప్రయత్నాల్లో పోలీసులు

వేములవాడ సమీపంలోని అగ్రహారం గుట్టల్లో గత నెల 21న ఓ యువతి మృతదేహం లభ్యంకాగా, ఆమె ఎవరన్నది ఇంకా తేలలేదు.  ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్ రెడ్డి, వేములవాడ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించానని, ఆమెను వివాహం చేసుకోవాలని భావించానని పోలీసుల విచారణలో వెల్లడించడంతో, 21న లభ్యమైన యువతి మృతదేహం ఆమెదే కావచ్చేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతి ఎవరో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పోలీసులు, మీడియా ప్రతినిధులు చందుర్తి, వేములవాడకు చేరుకుని విచారించినా, ఫలితం లేకపోయింది. ఆసలు శ్రీనివాస్ రెడ్డి ప్రేమించిన యువతి బతికే ఉందా? అన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేశారు. అగ్రహారం గుట్టల్లో వెలుగుచూసిన హత్య వెనుక కూడా శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడన్న అనుమానాలు ఓ వైపు, పోలీసులను తప్పుదారి పట్టించేందుకే నిందితుడు ప్రేమ కథను అల్లి ఉండవచ్చన్న అనుమానం మరోవైపు వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో అమ్మాయిలు అదృశ్యమయ్యారన్న కేసులేవీ నమోదు కాకపోవడంతో, మృతదేహం ఎవరిదన్న విషయాన్ని తేల్చేందుకు పోలీసులు విచారిస్తున్నారు.

More Telugu News