Andhra Pradesh: చంద్రబాబూ.. జగన్ సినిమా చూడటానికి వెళ్లితే అంత ఏడుపు ఎందుకు?: వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ

  • టీడీపీ అధినేత ఎవ్వరినీ ఎదగనివ్వలేదు
  • తన నీడను చూసి తానే భయపడుతున్నారు
  • హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత

ఎన్టీఆర్ కుటుంబంలో, తన కుటుంబంలో ఎవ్వరినీ చంద్రబాబు ఎదగనివ్వలేదని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దగ్గరినుంచి చంద్రబాబు తన నీడను చూసి తానే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తన సీఎం కుర్చీ చేజారిపోతున్న నేపథ్యంలో ఆ ప్రభావం పార్టీలో ఎక్కడ కనిపిస్తుందో అన్న ఆందోళన చంద్రబాబులో నెలకొందని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు.

వైసీపీ అధినేత జగన్ సినిమా చూడటానికి థియేటర్ కు వెళితే చంద్రబాబు దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. జగన్ తన కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లారనీ, దానికే చంద్రబాబుకు అంత ఏడుపు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు చౌకబారు, దిగజారుడు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. జగన్ కు అధికారం ఇవ్వాలని ఏపీ ప్రజలు సుస్పష్టంగా నిర్ణయించుకున్నారని వాసిరెడ్డి పద్మ అన్నారు. ప్రజాస్వామ్యంలో నేతలు కనీస విలువలను పాటించాలని ఆమె సూచించారు.

More Telugu News