Sachin Tendulkar: అమ్మాయిలతో షేవింగ్ చేయించుకున్న సచిన్ టెండూల్కర్!

  • యూపీలో అక్కాచెల్లెళ్ల షేవింగ్
  • గుర్తించి ప్రోత్సహించిన జిల్లెట్ సంస్థ
  • తనవంతు చేయూతనిచ్చేందుకు సచిన్ ప్రయత్నం

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఆటలోనే కాదు బయట కూడా తన వ్యక్తిత్వంతో సమున్నతస్థాయి అందుకున్నారు. ఎన్నో సామాజిక కార్యక్రమాలకు తనవంతు చేయూతనందిస్తున్నారు. మాటసాయం నుంచి ఆర్థికసాయం వరకు ఏది కావాలన్నా ముందుండే సచిన్ తాజాగా ఇద్దరు అక్కాచెల్లెళ్ల కోసం నిస్వార్థంగా ముందుకొచ్చిన వైనం ప్రశంసలు అందుకుంటోంది.

ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్స్ ను గమనిస్తే బార్బర్ షాప్ గాళ్స్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ కు చెందిని నేహా, జ్యోతి అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మగవారికి మాత్రమే పరిమితం అనుకోకుండా సొంతంగా బార్బర్ షాప్ పెట్టారు. మగవారికి షేవింగ్ చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు. ప్రఖ్యాత షేవింగ్ ఉపకరణాల సంస్థ జిల్లెట్ కూడా వీరికి తనవంతు ప్రచారం కల్పించింది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆ అక్కాచెల్లెళ్లను ప్రోత్సహించే క్రమంలో వారి సెలూన్ కు వెళ్లి షేవింగ్ చేయించుకున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సచిన్ ఇప్పటివరకు ఎక్కడా బయట షేవింగ్ చేయించుకోలేదు. ఆ విషయం తనే స్వయంగా చెప్పారు. "ఆ రికార్డు నేడు చెరిగిపోయింది. బార్బర్ షాప్ గాళ్స్ ను కలిసే కార్యక్రమంలో భాగంగా వారితో షేవింగ్ చేయించుకున్నాను. జిల్లెట్ సంస్థ ఇస్తున్న స్కాలర్ షిప్ ను వారికి అందించాను" అంటూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వివరాలు తెలిపారు.

యూపీలోని బన్వారీ తోలా అనే ప్రాంతంలో నివసించే నేహా, జ్యోతి తండ్రికి ఆసరాగా ఉండడం కోసం తాము కూడా క్రాఫింగ్, షేవింగ్ నేర్చుకున్నారు. ఓవైపు చదువుకుంటూనే సెలూన్ లో పనిచేయడం కొనసాగించారు. ఈ విషయం జిల్లెట్ సంస్థకు తెలియడంతో వారి కథను ఆధారంగా చేసుకుని చిన్న వాణిజ్యప్రకటనతో మరింత ఊపునిచ్చింది. తాజాగా సచిన్ సైతం వారి సెలూన్ కు విచ్చేయడంతో దేశవ్యాప్తంగా ఈ అక్కాచెల్లెళ్ల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

More Telugu News