Andhra Pradesh: రూ.50 కోట్లు ఖర్చు పెట్టారంట.. జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోండి!: ఈసీకి సీపీఎం నేత రామకృష్ణ లేఖ

  • దివాకర్ రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు
  • ఓటుకు రూ.2 వేలు ఇచ్చినట్లు చెప్పారు
  • పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు

టీడీపీ నేత, అనంతపురం లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత రామకృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన ఈరోజు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి లేఖ రాశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జేసీ దివాకర్ రెడ్డి నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆరోపించారు. ‘అనంతపురంలో తన కుమారుడు జేసీ పవన్ రెడ్డి పోటీ చేసిన సందర్భంగా రూ.50 కోట్లు ఖర్చు పెట్టానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఒక్కో ఓటుకు రూ.2 వేలు ఇచ్చుకున్నట్లు తెలిపారు.

ఈ విషయంలో ఈసీ కానీ, అనంతపురం కలెక్టర్ గానీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వ్యవహారంపై మేం పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. కాబట్టి అనంతపురం లోక్ సభ ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారంలో జేసీ దివాకర్ రెడ్డి నుంచి సాక్షులకు భద్రత కల్పించాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ద్వివేదీ వేగంగా చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నట్లు రామకృష్ణ అన్నారు. 

More Telugu News