Marutirao: 'మారుతీరావు లెజండ్' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు... విరుచుకుపడిన అమృత!

  • గత చరిత్ర తెలుసుకోకుండా పోస్టులా?
  • వెనకేసుకు రావద్దు
  • ప్రణయ్ భార్య అమృత

తన కుమార్తె అమృత, తమ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రేమించి పెళ్లి చేసుకుని తన కళ్ల ముందే తిరుగుతోందన్న ఆగ్రహంతో ఆమె భర్త ప్రణయ్ ని పరువు హత్య చేయించిన మిర్యాలగూడ వ్యాపారి తిరునగరు మారుతీరావును పొగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు వస్తుండటంపై అమృత మండిపడ్డారు. మారుతీరావు లెజండ్ అని కొందరు వ్యాఖ్యానిస్తుండటాన్ని ప్రస్తావించిన అమృత, ఆయన చరిత్ర తెలుసుకోకుండా వెనకేసుకు రావడం ఏంటని మండిపడ్డారు.

కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు బండారు లక్ష్మయ్య, బహుజన ప్రతిఘటన వేదిక కో ఆర్డినేటర్ సాంబశివరావులతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆమె, మారుతీరావు బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత తన కుటుంబంలో ప్రాణహాని భయం ఏర్పడిందని, ఎవరినీ నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తన విషయంలోనూ అసభ్యకర పోస్టులు వస్తున్నాయని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అమృతకు ఆసరాగా నిలుస్తామని చెప్పిన సంఘాల నేతలు, నిందితులకు కఠిన శిక్ష పడేవరకూ పోరాడతామని తెలిపారు.

More Telugu News