Vijay Sai Reddy: 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయి ఇప్పుడు ధర్మరాజులా మాట్లాడుతున్నారు: పంచుమర్తి అనురాధ

  • విజయసాయి బెయిల్ రద్దు చేయాలి
  • డేటా దొంగిలించింది వైసీపీ
  • ఇప్పుడు సేవామిత్ర గురించి మాట్లాడుతున్నారు
ఇటీవల క్రమం తప్పకుండా చంద్రబాబు, తదితరులపై విమర్శల దాడి చేస్తున్న వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డిపై టీడీపీ మహిళానేత పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె, 13 కేసుల్లో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ధర్మరాజులా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. డేటా దొంగిలించింది వైసీపీ అయితే, ఇప్పుడు సేవామిత్ర గురించి విజయసాయి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.

విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేసి మళ్లీ జైలుకు పంపించాల్సిన అవసరం కనిపిస్తోందని పంచుమర్తి విమర్శించారు. ఆర్థిక నేరగాళ్లకు శిక్షణ ఇచ్చే సంస్థకు విజయసాయి చైర్మన్ లా ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు వద్ద పనిచేసిన ఐఏఎస్ ల ఖ్యాతి ఐక్యరాజ్యసమితి వరకు చేరిందని, కానీ వైఎస్ వద్ద పనిచేసిన ఐఏఎస్ లు చంచల్ గూడ జైలుకు చేరుకున్నారని ఎద్దేవా చేశారు. అప్పట్లో వైఎస్ ప్రాపకంతోనే విజయసాయి ఓరియెంటల్ బ్యాంక్ డైరక్టర్ పదవిని దక్కించుకోగలిగారని ఆరోపించారు.

More Telugu News

Vijay Sai Reddy
Telugudesam