Congress: కాంగ్రెస్ టికెట్ కోసం పార్టీ మారబోమని బాండ్ పేపర్ రాసిచ్చిన నేతలు!

  • గెలవగానే టీఆర్ఎస్ లో చేరుతున్న నేతలు
  • బీ ఫామ్ లు ఇవ్వకుండా అడ్డుకున్న కార్యకర్తలు
  • బాండ్ పేపర్ తీసుకుని బీ ఫామ్ లు ఇచ్చిన షబ్బీర్ అలీ

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కాంగ్రెస్ టికెట్ ను కోరుకుంటున్న నేతలు, గెలిస్తే, పార్టీ మారబోమంటూ బాండ్‌ పేపర్‌ రాసిస్తున్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీ ఫామ్ లు పంచే కార్యక్రమానికి సీనియర్ నేత షబ్బీర్ అలీ రాగా, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగి, పార్టీ మారబోమని హామీ పత్రం తీసుకున్న తరవాతనే టికెట్లు ఇవ్వాలని నినాదాలు చేయడంతో, అభ్యర్థులతో షబ్బీర్ అలీ ఇదే విషయమై ప్రత్యేకంగా చర్చించాల్సి వచ్చింది.

 రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు భారీగా టీఆర్ఎస్ లో చేరుతున్నారని, కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా ఇలా చేయడం భావ్యం కాదని, పార్టీ మారబోమని హామీపత్రాన్ని ఇస్తేనే బీ ఫామ్ లు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థులు, అందుకు తగ్గట్టుగానే బాండ్ పేపర్ పై గెలిచిన తరువాత తాము కాంగ్రెస్ ను వీడబోమని రాసిచ్చారు. కామారెడ్డి జిల్లాలో తొలి విడతలో ఎన్నికలు జరిగే 9 మండలాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నుంచి బాండ్ పేపర్ తీసుకున్న షబ్బీర్ అలీ బీ ఫామ్ లను ఇచ్చారు.

More Telugu News