raj babbar: మోదీ కుర్తాల సైజు ఎంతో మమతా బెనర్జీకి తెలుసు: రాజ్ బబ్బర్

  • పశ్చిమబెంగాల్ లో రెండు ఉత్పత్తులు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచాయి
  • వాటిని బహూకరించాలంటే మమత ఒకే ఒక వ్యక్తికి పంపుతారు
  • బీజేపీ బలపడేందుకు మమత సహకరిస్తున్నారు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సినిమా నటుడు రాజ్ బబ్బర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కుర్తాల సైజు ఎంతో మమతకు తెలుసని అన్నారు. ఇతర పార్టీల నేతలతో కూడా తాను ఆత్మీయంగా ఉంటానని... కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ తనకు మంచి మిత్రుడని, మమతా బెనర్జీ తనకు ప్రతి సంవత్సరం కుర్తాలు పంపుతారని సినీ నటుడు అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్ బబ్బర్ ఈ మేరకు విమర్శించారు.

'పశ్చిమబెంగాల్ లో రెండు ఉత్పత్తులు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచాయి. ఒకటి వెన్నతో తయారు చేసిన మిఠాయిలు, మరొకటి కుర్తా. మమతా బెనర్జీ వీటిని బహూకరించాలంటే, ఆమె వాటిని ఒకే ఒక వ్యక్తికి పంపుతారు. అంటే కుర్తా సైజు ఎంతో ఆమెకు తెలుసనే విషయం మీరు అర్థం చేసుకోవచ్చు' అంటూ రాజ్ బబ్బర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమబెంగాల్ లో బీజేపీ బలపడేందుకు మమతా బెనర్జీ సహకరిస్తున్నారని రాజ్ బబ్బర్ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యం పట్ల తృణమూల్ కాంగ్రెస్ కు గౌరవం లేదని విమర్శించారు.

More Telugu News