Andhra Pradesh: గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ‘నువ్వు తోపు రా’ హీరోకు గాయాలు.. ఓ మహిళ దుర్మరణం!

  • గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఘటన
  • రహదారిపై మొక్కలకు నీళ్లు పడుతున్న మహిళ
  • వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఈరోజు వేగంగా వెళుతున్న ఓ కారు.. జాతీయ రహదారిపై మొక్కలకు నీళ్లు పెడుతున్న మహిళను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బాధితురాలు అక్కడికక్కడే చనిపోగా, కారు అదుపుతప్పి డివైడర్ ను బలంగా గుద్దుకుంది. ఈ సందర్భంగా కారులో వెళుతున్న నటుడు సుధాకర్ కోమకులకు గాయాలు అయ్యాయి.

హరనాథ్ బాబు దర్శకత్వం వహించిన ‘నువ్వు తోపు రా’ అనే సినిమాలో సుధాకర్ హీరోగా నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News