Anant Ambani: కాంగ్రెస్ అభ్యర్థికి ముకేశ్ అంబానీ మద్దతు.. మోదీ ర్యాలీలో కనిపించిన కుమారుడు అనంత్ అంబానీ

  • మోదీ ర్యాలీలో ముందు వరుసలో అనంత్ అంబానీ
  • రెండు వారాల క్రితం దక్షిణ ముంబై కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్‌కు ముకేశ్ మద్దతు
  • మిలింద్‌ను ‘మ్యాన్ ఫర్ సౌత్ ముంబై’గా అభివర్ణించిన అంబానీ

ఆసియా సంపన్నుడైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ముంబైలో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన ర్యాలీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ డియోరాకు రెండు వారాల క్రితం ముకేశ్ అంబానీ మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ఆయన తనయుడు మోదీ ర్యాలీలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ర్యాలీలో ముందు వరుసలో కూర్చున్న అనంత్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోదీ చెప్పింది విని దేశానికి మద్దతుగా నిలిచేందుకే ర్యాలీకి హాజరైనట్టు పేర్కొన్నారు.

కాగా, ఇటీవల 137 సెకెన్ల వీడియోను డియోరా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అందులో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. మిలింద్‌ను ‘మ్యాన్ ఫర్ సౌత్ ముంబై’గా అభివర్ణించారు. దక్షిణ ముంబైకి ఆయన దశాబ్దకాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్నారని, అయన ఎంతో వివేకవంతుడు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విషయాల పట్ల ఎంతో అవగాహన కలిగిన వారని కొనియాడారు.

రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ ముకేశ్ అంబానీ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకోగా, ఇప్పుడు ఆయన కుమారుడు అనంత్ మోదీ ర్యాలీలో పాల్గొనడం హాట్ టాపిక్ అయింది.

More Telugu News