Hyderabad: ఎదురింటి యువకుడితో పరారై, ప్రాణహాని ఉందని ఫోన్ చేసిన వివాహిత... రంగంలోకి దిగిన పోలీసులు!

  • హైదరాబాద్, బంజారాహిల్స్ లో ఘటన
  • భర్తతో గొడవపడి ఢిల్లీకి చేరుకున్న మహిళ
  • సెల్ నంబర్ ఆధారంగా విచారణ

అనుమానాస్పద స్థితిలో ఇంటి నుంచి అదృశ్యమైన ఓ వివాహిత, ఫోన్ చేసి, తనకు ప్రాణహాని ఉందని చెప్పడం, ఆ వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో ఆమె భర్త ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటన హైదరాబాద్, బంజారాహిల్స్ పరిధిలో జరిగింది. నేపాల్ కు చెందిన హరీశ్, తిళా దంపతులు పదేళ్ల క్రితం నగరానికి వచ్చి స్థిరపడ్డారు.

హరీశ్ వాచ్ మెన్ గా పనిచేస్తుండగా, తిళా ఇంట్లోనే ఉండేది. ఈ క్రమంలో ఎదురింటి యువకుడితో పరిచయం పెంచుకున్న ఆమె, 20వ తేదీన ఇంట్లో గొడవ జరగడంతో పిల్లలను వదిలి వెళ్లిపోయింది. ఆమెకోసం హరీశ్ గాలిస్తున్న క్రమంలోనే, నిన్న మధ్యాహ్నం తన మామ భీమ్ సింగ్ కు ఫోన్ చేసిన తిళా, తాను ఎదురింటి యువకుడితో వెళ్లానని, తానిప్పుడు ఢిల్లీలో ఉన్నానని, ప్రాణహాని ఉందని చెప్పింది. ఆపై అదే ఫోన్ నంబర్ కు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుండటంతో, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె ఎక్కడుందన్న విషయాన్ని గుర్తించే ప్రయత్నాల్లో ఉన్నట్టు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News