India: మోదీజీతో కలిసి పనిచేస్తా.. బీజేపీలో చేరిన బాలీవుడ్ నటుడు సన్నీడియోల్!

  • ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ తీర్థం
  • కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రులు నిర్మల, పీయూష్ గోయల్
  • ఘాయల్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న సన్నీ డియోల్

ప్రముఖ బాలీవుడ్ నటుడు, ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ ఈరోజు బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు సన్నీ డియోల్ కు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా, బీజేపీలో చేరిన అనంతరం సన్నీ డియోల్ మాట్లాడుతూ..  ‘మా నాన్న ధర్మేంద్ర మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్ పేయితో కలిసి పనిచేశారు. ఆయనకు మద్దతు ఇచ్చారు. నేను ఈరోజు మోదీజీతో కలిసి పనిచేసేందుకు, మద్దతు ఇచ్చేందుకు వచ్చా. నేను నా పనితోనే జవాబు ఇస్తా’ అని తెలిపారు.

కాగా, సన్నీ డియోల్ బీజేపీలో చేరడం తమకు లాభిస్తుందని పీయూష్ గోయల్, సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బేతాబ్(1982) సినిమాతో సన్నీ డియోల్ అరంగేట్రం చేశారు. 1990ల్లో వచ్చిన ఘాయల్ సినిమాతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.

More Telugu News