Nagapur: ప్రియురాలితో కలిసి రెండు హత్యలు చేసిన క్రికెటర్ మహ్మద్ అఖ్లాక్... అరెస్ట్!

  • నాగపూర్ లో దంపతుల దారుణ హత్య
  • ప్రియుడితో పెళ్లికి అంగీకరించడం లేదని కుమార్తె మర్డర్ ప్లాన్
  • సహకరించిన అఖ్లాక్

మహారాష్ట్ర క్రికెటర్ మహ్మద్ అఖ్లాక్, తన ప్రియురాలితో కలిసి రెండు హత్యలు చేసిన కేసులో అరెస్ట్ కావడం కలకలం రేపింది. నాగపూర్ లో ఆదివారం నాడు వృద్ధ దంపతులు హత్యకు గురికాగా, కేసును ఛేదించిన పోలీసులు అఖ్లాక్ సాయంతో ఆ దంపతుల కుమార్తే వారిని పాశవికంగా హత్య చేసిందని తేల్చారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, శంకర్ చంపటి (72), సీమా (64) వారి ఇంట్లోనే బలమైన గాయాలతో రక్తపు మడుగులో విగత జీవులుగా కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారి కుమార్తె ప్రియాంక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ, మహ్మద్ అఖ్లాక్ ను ప్రేమించింది. వారి వివాహానికి శంకర్, సీమాలు అంగీకరించలేదు.

దీంతో వారి అడ్డు తొలగించుకోవాలని భావించిన ప్రియాంక, తన ప్రియుడి సాయాన్ని కోరింది. హత్యకు ముందు వారు తినే ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి, ఆపై తలపై మోది వారిని హత్య చేశారు. వీరిద్దరూ తాము చేసిన దారుణాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ రిమాండ్ కు తరలించామని అన్నారు.

More Telugu News