Rajahmundry: టీడీపీ మళ్లీ గెలవబోతోందనేందుకు ఇదే నిదర్శనం!: ఆదిరెడ్డి భవాని

  • ఎన్నికలు జరిగిన తీరుపై చంద్రబాబుతో మాట్లాడా
  • రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు ఓట్లు వేశారు
  • రాజమండ్రిలో టీడీపీ గెలుపు ఖాయం 

రాజమండ్రి సిటీలో టీడీపీ గెలుపు ఖాయమని ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన అనంతరం, సీఎం చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసానికి పార్టీ అభ్యర్థులు ఈరోజు ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో చంద్రబాబును భవాని కలిశారు.

అనంతరం, మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఎన్నికలు జరిగిన తీరు గురించి చంద్రబాబుతో కలిసి మాట్లాడేందుకు వచ్చానని అన్నారు. ఎన్నికల పోలింగ్ తీరు సవ్యంగా లేకపోయినప్పటికీ, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఓట్లు వేశారని అన్నారు. ఈవీఎంలు మొరాయించినప్పటికీ, ప్రజలు, ముఖ్యంగా మహిళలు
అర్ధరాత్రి వరకూ వేచి చూసి తమ ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషదాయకమని అన్నారు.

 రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివెళ్లి ఓట్లు వేయడం, టీడీపీ మళ్లీ గెలవబోతోందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబునాయుడు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధే తమకు అండగా ఉన్నాయని, అవే తమ అభ్యర్థులను గెలిపిస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News