Jet Airways: కేవలం 9 విమానాలకు పడిపోయిన జెట్... టికెట్ రద్దు చేసుకున్న వారికే రూ. 3 వేల కోట్ల బకాయి!

  • గురువారం నాడు 14 విమానాలు నడిపిన సంస్థ
  • నేడు మరో 5 నేలకు పరిమితం
  • సమీక్షించి రిపోర్టు ఇవ్వాలన్న సురేష్ ప్రభు

ఒకప్పుడు వందల సంఖ్యలో విమాన సర్వీసులను నడిపిస్తూ, వేల మందిని గమ్యస్థానాలకు చేర్చిన జెట్ ఎయిర్ వేస్, పరిస్థితి ఇప్పుడు మరింతగా దిగజారింది. గురువారం నాడు 14 విమానాలు నడిపిన సంస్థ, శుక్రవారం వచ్చేసరికి మరో 5 విమానాలను గ్రౌండింగ్ చేసి, 9 విమానాలకు పరిమితం అయింది. రెండు బోయింగ్ 737లను, మరో ఏడు ఏటీఆర్ విమానాలను మాత్రమే నేడు జెట్ నడిపిస్తోంది.

ఇక జెట్ ఎయిర్ వేస్ సంస్థలో టికెట్లను బుక్ చేసుకున్న వారికి సొమ్ము వాపస్ కింద ఇవ్వాల్సిన మొత్తమే రూ. 3 వేల కోట్లకు పైగా ఉందని తెలుస్తోంది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్ వేస్, ఉద్యోగులకు మూడు నెలల వేతనాలను ఇవ్వాల్సివుంది. సంస్థ తాజా పరిస్థితిపై సమీక్షించి, రిపోర్టు ఇవ్వాలని విమానయాన శాఖా మంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు.

ఈ మేరకు విమానయాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలాకు సమీక్ష బాధ్యతలు అప్పగించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలని, వారికి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేయాలని సూచించారు.

More Telugu News