ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ కుయుక్తులు: వైసీపీ నేత సుబ్బారెడ్డి ఆరోపణలు

  • ఈవీఎంలు పనిచేయడం లేదంటూ దుష్ప్రచారం
  • సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇటువంటి ప్రచారం  ప్రారంభించడం దారుణం
  • అధికారులు తక్షణం స్పందించాలి
ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన పరివారం ఈవీఎంలు పనిచేయడం లేదంటూ దుష్ప్రచారానికి తెరదీయడం దారుణమని వైసీపీ నేత వై.వి.సుబ్బారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబంతో సహా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుని వచ్చి ఇటువంటి ప్రచారం ప్రారంభించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కుటుంబం అంతా పచ్చ వస్త్రాలు ధరించి ఓటు హక్కు వినియోగించుకున్నారని, అనుకూల మీడియా సహకారంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. గుత్తిలో జనసేన అభ్యర్థి ఈవీఎం పగులగొడితే అది వైసీపీ చేసినట్లు అనుకూల మీడియా ప్రచారం చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల అధికారులు టీడీపీ నేతల ఎత్తుగడను గమనించి తక్షణం స్పందించాలని కోరారు.

 ఓటమి భయంతో తెలుగుదేశం నాయకులు వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి వైసీపీ వార్డు కన్వీనర్‌పై దాడులకు పాల్పడినందున అతన్ని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. అలాగే కడప జిల్లా పొద్దుటూరులో సి.ఎం.రమేష్‌ కూడా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Go Back to Shorts
YSRCP
yvsubbareddy
Telugudesam
EVM

More Telugu News