Andhra Pradesh: నోరుజారిన గౌరు చరితారెడ్డి.. పాణ్యం సభలో ‘జై జగన్’ అన్న టీడీపీ నేత

  • ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన చరితారెడ్డి
  • ఘనస్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు
  • జై చంద్రబాబు అని సర్దుకున్న చరితారెడ్డి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన కర్నూలు నేత గౌరు చరితా రెడ్డి ప్రచారం సందర్భంగా నోరు జారారు. పాణ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యేగా తనను, లోక్ సభ సభ్యుడిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో టీడీపీకే ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. చివరగా జై జగన్ అని గట్టిగా నినాదం ఇవ్వడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్ కు గురయ్యారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తనకు ఇచ్చిన ఘనస్వాగతానికి చరితారెడ్డి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఒక్కసారిగా ‘జై జగన్’ అని నినాదం ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఈలలతో మార్మోగింది. వెంటనే తేరుకున్న చరితారెడ్డి నవ్వుతూ.. ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అని నినాదాలు ఇచ్చి ముందుకు కదిలారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నాయి.




More Telugu News