Chandrababu: మోదీని సవాలు చేసే నాయకుడు చంద్రబాబు ఒక్కరే: దేవెగౌడ

  • ఎన్టీఆర్ స్వస్థలానికి రావడం ఆనందదాయకం
  • ప్రాంతీయ పార్టీల సత్తాని చాటింది ఎన్టీఆరే
  • పామర్రు సభలో ప్రసంగం

తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా పామర్రులో నిర్వహించిన ఎన్నికల సభలో చంద్రబాబునాయుడితో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ కూడా పాల్గొన్నారు. ఆయన ఇవాళ సీఎం చంద్రబాబుతో కలిసి ప్రచారానికి వచ్చారు. పామర్రులో చంద్రబాబు ఈ రాజకీయ దిగ్గజాన్ని గౌరవిస్తూ తాను మొదట మాట్లాడారు. ఆపై దేవెగౌడను మాట్లాడాల్సిందిగా కోరారు. సాధారణంగా ఓ సభలో ప్రధాన నేత మాత్రమే చివర మాట్లాడతారు. కానీ దేవెగౌడ స్థాయిని గుర్తించిన చంద్రబాబు సమున్నతిరీతిలో ఆయన్ను ప్రధాన వక్తగా గౌరవించారు.

ఈ సందర్భంగా దేవెగౌడ ఆంగ్లంలో ప్రసంగిస్తూ, టీడీపీ వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్ స్వస్థలం అయిన కృష్ణా జిల్లాకు రావడం ఆనందంగా ఉందన్నారు. జాతీయ పార్టీలే దేశ రాజకీయాలను శాసిస్తున్న రోజుల్లో ప్రాంతీయ పార్టీలు కూడా దేశాన్ని శాసించగలవని నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. దేశంలో మొదటిసారిగా కిలో బియ్యం రూ.2లకే ఇచ్చింది ఎన్టీఆరేనని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన దేవెగౌడ స్థానికుల మనసును ఆకట్టుకున్నారు.

ఇక చంద్రబాబు గురించి చెబుతూ, ప్రధాని మోదీని ఎదిరించగల సత్తా దేశంలో ఒక్క చంద్రబాబుకే సొంతం అని పేర్కొన్నారు. దేశానికి ప్రస్తుత కాలంలో చంద్రబాబునాయుడు వంటి నేతల అవసరం ఎంతో ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కితాబిచ్చారు.

More Telugu News