West Godavari District: కాపులంతా నాకు కాపు కాయాలి, టీడీపీని గెలిపించాలి: సీఎం చంద్రబాబు

  • కాపులను బీసీల్లో చేర్చాం
  • మోసాలు చేసే వాళ్లకు కాపులు ఓటేస్తారా?
  • మనకు వైసీపీ రౌడీల పెత్తనం అవసరమా?

కాపులంతా తనకు కాపు కాయాలని, ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోరారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేర్చామని, వారి అభివృద్ధి కోసం రూ.వెయ్యి కోట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మోసాలు చేసే వాళ్లకు కాపులు ఓటేస్తారా? మనకు వైసీపీ రౌడీల పెత్తనం అవసరమా? అని ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదా అన్నది కేసీఆర్, జగన్ కు అంతర్గత వ్యవహారమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్ తనపై కేసులు ఉండటంతో మోదీని చూసి భయపడుతున్నారని విమర్శించారు. ఏపీకి న్యాయం జరగాలంటే మోదీ ఓటమిపాలు కావాల్సిందేనని, ఏపీకి మోదీ నమ్మకద్రోహం చేశారని నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం టీడీపీకి బ్రహ్మరథం పట్టిందని, ఈ ఎన్నికల్లో కూడా అదే విధంగా జరగాలని కోరారు. మహిళలకు శాశ్వతంగా రుణపడి ఉంటానని, సేవ చేసే ప్రభుత్వాన్ని ఆదరించే బాధ్యత మహిళలదేనని అన్నారు.

More Telugu News