Balakrishna: మోదీకి సిగ్గూ, శరం ఉంటే నా తిట్లకు సముద్రంలోకి దూకి చచ్చిపోవాలి: బాలకృష్ణ సవాల్

  • గతంలోనూ మోదీని తిట్టాను
  • మోదీ, కేసీఆర్, జగన్ కలిసి వచ్చినా ఏమీ చేయలేరు
  • హిందూపురం రోడ్ షోలో విమర్శలు

టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. హిందూపురంలో ఆయన ఇవాళ రోడ్ షో నిర్వహించారు. భారీగా హాజరైన జనసందోహాన్ని చూడగానే బాలయ్యలో ఉత్సాహం రెట్టింపైంది. మోదీకి సిగ్గూ, శరం లేవని, నిజంగా మగాడే అయితే తాను తిట్టే తిట్లకు సముద్రంలో దూకి చచ్చిపోవాలంటూ సవాల్ విసిరారు. ఇప్పుడే కాదని, మోదీని ఇంతకుముందు కూడా తీవ్రస్థాయిలో తిట్టానని, అయినా ఆయనకు సిగ్గూ, శరంలేవని వ్యాఖ్యానించారు.

"మోదీని నేను తిట్టినట్టు దేశంలో ఎవరూ తిట్టి ఉండరు" అని పేర్కొన్నారు. గతంలో ఓసారి బాలకృష్ణ హిందీ భాషలో సైతం మోదీపై వాగ్బాణాలు సంధించారు. తాజాగా, అదే తీవ్రతతో తిట్ల వర్షం కురిపించారు. కేసీఆర్, జగన్ లతో కలిసి రాష్ట్రాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ మండిపడ్డారు. ఈ ముగ్గురూ కలిసి వచ్చినా తననేమీ చేయలేరంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొన్ని సినిమా డైలాగులు చెప్పి సభికులను అలరించారు.

More Telugu News