CM Ramesh: టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇంటిపై తెల్లవారుజాము నుంచి పోలీసుల దాడులు!

  • దాదాపు 50 మంది పోలీసుల సోదాలు
  • సెర్చ్ వారంట్ లేకుండా దాడులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రమేశ్

తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేశ్ పై ఈ తెల్లవారుజాము నుంచి పోలీసుల దాడులు జరుగుతున్నాయి. ఎర్రగుంట్ల మండల పరిధిలోని పొట్లదుర్తిలోని ఆయన ఇంట్లోకి ప్రవేశించిన సుమారు 50 మంది, అన్ని గదుల్లోనూ సోదాలు చేస్తున్నారు. పోలీసులు సీఎం రమేశ్ పడకగదిని కూడా వదల్లేదని తెలుస్తోంది. సెర్చ్ వారంట్ కోసం అడిగిన సీఎం రమేశ్, వారంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని పోలీసులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, ఎస్పీ ఆదేశాల మేరకు తాము వచ్చామని పోలీసులు పేర్కొనడం గమనార్హం.

కాగా, తనపై రాజగీయ కక్షతోనే ఈ తరహా దాడులు చేయిస్తున్నారని ఈ సందర్భంగా రమేశ్ ఆరోపించారు. ఇంతవరకూ ఆయన ఇంట్లో ఏమీ లభ్యం కాలేదని తెలుస్తోంది. సీఎం రమేశ్ ఇంటితో పాటు ఆయన ప్రధాన అనుచరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల క్రితం పుట్టా సుధాకర్ యాదవ్ ఇంట్లో ఇదే తరహా దాడులు జరిగినప్పుడు సీఎం రమేశ్ ఆయనకు మద్దతుగా నిరసనకు దిగారు.

More Telugu News