Crime News: తమ ప్రేమను కాదన్నారని ప్రాణాలే తీసుకున్నారు : ఓ జంట విషాదాంతం

  • పెద్దలు అంగీకరించడం లేదని రైలు కిందపడి ఆత్మహత్య
  • బాధితులు ఇద్దరూ డిగ్రీ, ఇంటర్‌ విద్యార్థులు
  • మృతులు ఇద్దరూ రంగారెడ్డి జిల్లా వాసులు

తమ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడం లేదన్న క్షణికావేశంలో ఓ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈరోజు తెల్లవారు జామున మూడు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే...రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడేనికి చెందిన శ్రవణ్‌, మహేశ్వరం మండలం కల్వకోల్‌ గ్రామానికి చెందిన మయూరి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రవణ్‌ డిగ్రీ చదువుతుండగా, మయూరి ఇంటర్‌ చదువుతోంది. వీరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దల వద్ద ప్రస్తావించారు. వారు ససేమిరా అన్నారు.

దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరూ చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు. శంషాబాద్‌ మండలం పిల్లోనిగూడ సమీపంలో  తెల్లవారు జామున రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీన్ని గమనించిన సమీపంలోని రైతులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలిని సందర్శించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

More Telugu News