Uttar Pradesh: మందుబాబుల బీభత్సం.. బీరును ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని సేల్స్ మెన్ కాల్చివేత!

  • ఉత్తరప్రదేశ్ లోని  నోయిడాలో ఘటన
  • రూ.10 అధికంగా అమ్ముతున్న షాపు
  • బాధితుడిపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు

బీరును ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని ఆగ్రహించిన ఇద్దరు యువకులు షాపులో సేల్స్ మెన్ గా పనిచేస్తున్న ఓ యువకుడిని కాల్చిచంపారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపును ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది.

నోయిడాలోని ఐచార్ ప్రాంతంలో ఉన్న ఓ బీరు షాపు వద్దకు సురేంద్ర, రాజు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీర్ ధర ఎంత? అని వీరు అడగ్గా షాపులో పనిచేస్తున్న కుల్దీప్ సమాధానం ఇచ్చాడు. అయితే మిగతా షాపుల కంటే ఇక్కడ రూ.10 అధికంగా అమ్ముతున్నారని యువకులు కుల్దీప్ తో వాగ్వాదానికి దిగారు. వివాదం కాస్తా ముదరడంతో ఇద్దరు యువకులు తమ తుపాకులతో కుల్దీప్ పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లిపోవడంతో కుల్దీప్ రక్తపు మడుగులో పడిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కుల్దీప్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు పరారీలో ఉన్న సురేంద్ర, రాజు కోసం గాలింపును ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు జరిపేందుకు మద్యం ధరే కారణమా? లేక వేరే ఉద్దేశాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

More Telugu News