Chandrababu: వైసీపీని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే!: కర్నూల్ రోడ్ షోలో చంద్రబాబు సెటైర్

  • వైసీపీకి ఓటేస్తే నేరస్తులుగా మార్చేస్తారు
  • అదో పనికిమాలిన పార్టీ
  • ఆ పార్టీకి మద్దతివ్వొద్దంటూ విజ్ఞప్తి

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో తీవ్రత పెంచారు. వరుసగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో  పాల్గొంటూ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు చేస్తున్నారు. తాజాగా కర్నూలు రోడ్ షోలో పాల్గొని ఆద్యంతం హుషారుగా ప్రసంగించారు. పొరబాటున కూడా వైసీపీకి సపోర్ట్ చేయొద్దని హెచ్చరించారు. మొదట జేబులు కొట్టడం లాంటి ఒక చిన్న నేరం చేయించి, ఆ తర్వాత పెద్ద పెద్ద నేరాలు చేయిస్తారని వివరించారు. అదో పనికిమాలిన పార్టీ అని, నేరస్తుల పార్టీ అని విమర్శించారు.

యువతకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తున్నానని, ఇలాంటి సమయంలో ఎవరూ వైసీపీకి మద్దతివ్వొద్దని సూచించారు. ఆ పార్టీని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టేనని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక, ప్రభుత్వ పథకాల గురించి చెబుతూ కార్యకర్తలను, అభిమానులను నవ్వించారు. చంద్రన్న బీమా, ఆహారభద్రత పథకాలతో పాటు అన్న క్యాంటీన్లను గురించి మాట్లాడుతూ, తమ్ముళ్లు ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ల మీద అలిగితే పెద్ద ఖర్చు లేకుండానే ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం చేయొచ్చని చమత్కరించారు. అయితే కోపం తగ్గిన తర్వాత ఇంటికే వెళ్లాలని చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు సూచించారు.

More Telugu News