KCR: 64 క్రిమినల్ కేసులుంటే 4 కేసులే చూపుతారా?... కేసీఆర్ కు నోటీసులు పంపిన హైకోర్టు

  • తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ పిటిషన్
  • విచారణకు స్వీకరించిన హైకోర్టు
  • 4 వారాల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు కేసీఆర్ చిక్కుల్లో పడ్డారు. ఆయన గత ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ సందర్భంగా అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనపై 64 క్రిమినల్ కేసులంటే, తొలి అఫిడవిట్ లో కేవలం 4 కేసులే ఉన్నట్టుగా పేర్కొన్నారని గజ్వేల్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి  పిటిషన్ వేశారు.

పూర్తి సమాచారం ఇవ్వకుండా ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్ దాఖలు చేసిన కేసీఆర్ పై అనర్హత వేటు వేయాలని శ్రీనివాస్ హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ పై ప్రాథమిక పరిశీలన చేసిన న్యాయస్థానం విచారణకు స్వీకరించడమే గాకుండా, 4 వారాల్లో వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్ కు, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నోటీసులు పంపించింది. కేసీఆర్ కొన్నినెలల క్రితమే జరిగిన ముందస్తు ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

More Telugu News