Telugudesam: మాజీ ఎంపీ హర్షకుమార్ కారు బోల్టులు తీసేసిన గుర్తుతెలియని దుండగులు

  • సకాలంలో గుర్తించడంతో తప్పిన ముప్పు
  • రాజమండ్రిలో తీవ్ర కలకలం
  • ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన హర్షకుమార్

రాజమండ్రిలో నేడు తీవ్ర కలకలం రేగింది. మాజీ ఎంపీ హర్షకుమార్ కారు చక్రం బోల్టులను గుర్తుతెలియని దుండగులు తొలగించారు. అయితే సకాలంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. ఈ ఉదంతంపై హర్షకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇటీవలే టీడీపీలో చేరిన ఐదు రోజులకే గుడ్ బై చెప్పేశారు.

చివరి వరకు తనకే టికెట్ దక్కుతుందని గట్టి నమ్మకంతో ఉన్న ఆయనకు పార్టీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం రుచించలేదు. అమలాపురం లోక్ సభ టికెట్ ను దివంగత స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాధుర్ కు కేటాయించారు. దాంతో చంద్రబాబు తీరుపై హర్షకుమార్ అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోవడంలేదని, తన అనుచరులు ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్లు ఓటేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, కారు టైరు బోల్టులు పీకేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

More Telugu News