Chandrababu: మా ఆస్తులు కొట్టేసిన నువ్వేంటి, నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది?: కేసీఆర్ ను నిలదీసిన చంద్రబాబు

  • నీ ఆటలు సాగనివ్వం
  • మా ప్రజలు నీకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు
  • నా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టను

దమ్ము, ధైర్యం ఉంటే జగన్, కేసీఆర్, మోదీ ముందుకు వచ్చి నేరుగా తనను ఎదుర్కోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా రేపల్లె ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, జగన్ ఫ్యాన్ కు స్విచ్ హైదరాబాద్ లో ఉంటే, దానికి కరెంట్ ఢిల్లీలో ఉన్న మోదీ ఇస్తారని ఎద్దేవా చేశారు. మోదీ కరెంట్ ఇచ్చినప్పుడు, కేసీఆర్ స్విచ్చేస్తేనే ఆ ఫ్యాన్ తిరుగుతుందని అన్నారు. ‌

"మనల్ని ఓడించి జగన్ కు పట్టం కడితే నీ కాల్మొక్తా బాంచన్ అనుకుంటూ లోటస్ పాండ్ లో కూర్చొని కేసీఆర్ ను ప్రసన్నం చేసుకుంటూ ఉంటాడు. అసలీ కేసీఆర్ ఏనాడైనా సెక్రటేరియట్ కు వచ్చాడా? ఎప్పుడన్నా గ్రామాలు తిరిగాడా? ఎప్పుడన్నా కష్టపడ్డాడా? ఆయన మహానాయకుడు. మనం ఏమీలేని దశ నుంచి అభివృద్ధి చెందుతున్నాం. ధనిక రాష్ట్రాలకు దీటుగా ఎదుగుతున్నాం.

తెలంగాణలో పార్టీలన్నింటినీ మింగేసిన కేసీఆర్ ఇప్పుడు మన జోలికి వస్తున్నాడు. నేను చెబుతున్నా, నా జోలికి రావొద్దు. మా రాష్ట్రం జోలికి వస్తే ఖబడ్దార్ కేసీఆర్. జాగ్రత్తగా ఉండు, మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టం. తెలంగాణకు ఏమీ చేయకపోయినా ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టి 88 సీట్లు గెలిచాడు. ఎన్నికల్లో గెలిచామని, గెలిచినవాళ్లను తమ పార్టీలోకి లాక్కున్నామని విర్రవీగుతున్నాడు. తానేదో పరాక్రమవంతుడ్నని అనుకుంటున్నాడు కేసీఆర్. నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నాడు. మా ఆస్తులు కొట్టేసిన నువ్వేంటి, నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది? 5 కోట్ల మంది ప్రజలు నీకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు" అంటూ నిప్పులు చెరిగారు.

More Telugu News