Chandrababu: చంద్రబాబుతో పవన్‌ రహస్య స్నేహం ప్రజలకు తెలిసిపోయింది: వైసీపీ అధికార ప్రతినిధి భుజంగరావు

  •  పవన్, బాబును పల్లెత్తు మాట అనడం లేదెందుకు
  • ఓటుకు నోటు, ఐటీ గ్రిడ్‌ వ్యవహారాలు ప్రస్తావించరేం
  • సొంతూరు మొగల్తూరుకు, సమాజానికి కూడా పవన్‌ చేసింది ఏమీ లేదు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కొనసాగిస్తున్న రహస్య స్నేహం ప్రజలకు తెలిసిపోయిందని వైసీపీ అధికార ప్రతినిధి భుజంగరావు అన్నారు. భీమవరంలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బాబుతో ఉన్న స్నేహం వల్లే ఓటుకు నోటు కేసు నుంచి ఇటీవల ఐటీ గ్రిడ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన డేటా చోరీ కేసు వరకు దేని గురించీ ఆయన పల్లెత్తు మాట అనడం లేదని విమర్శించారు.

‘పిల్లి కళ్ళు మూసుకుని పాలుతాగుతూ లోకం చీకటిలో ఉంది’ అనుకుంటే కుదరదని, పవన్‌ వ్యవహారాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఏపీ రాజధాని భూముల సేకరణలో అక్రమాలు జరిగాయని నిన్నమొన్నటి వరకు అన్న పవన్‌కల్యాణ్‌ ఇప్పుడెందుకు వాటి గురించి మాట్లాడడం లేదో ప్రజలు గ్రహించలేని అమాయకులు కారన్నారు. బాబు, పవన్‌ మధ్య బంధానికి ఈ ఒక్క సాక్ష్యం చాలన్నారు. ఇక, సొంతూరు మొగల్తూరుకు చిరంజీవి కుటుంబం చేసిందేమీ లేదన్నారు. ఇన్ని విమర్శలు గుప్పిస్తున్న పవన్‌ కల్యాణ్‌ సొంతూరికి ఏం చేశారో ఒక్కసారి చెప్పాలని కోరారు.

More Telugu News