Jana Sena: పవన్‌ది దుష్ప్రచారం...బాధ్యతారాహిత్యం : కేటీఆర్‌ కౌంటర్‌

  • ప్రజల్ని తప్పుతోవ పట్టించేలా మాట్లాడడం సరికాదు
  • తెలంగాణలో ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారు
  • దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఉన్నారు

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి అని, ఆయన బాధ్యతరాహిత్యంతో మాట్లాడడం సరికాదని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆంధ్రాలో మనం కులాలు, మతాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే ఆంధ్రా వాళ్లను అలుసుగా భావించే తెలంగాణ వాళ్లు కుల, వర్గ విభేదాల్లేకుండా ఐక్యంగా మనవారిని చితక్కొడుతున్నారని పవన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ట్విట్టర్‌లో ఘాటుగా సమాధానమిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా పవన్‌ మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఆయన మాటలు ప్రజల్ని తప్పుతోవ పట్టించేలా ఉన్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో ఆంధ్రా ప్రజలే కాదు దేశంలోని ఇతర అన్ని రాష్ట్రాల ప్రజలు సమైక్యంగా,  ప్రశాంతంగా జీవిస్తున్నారని గుర్తు చేశారు. పనిగట్టుకుని ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలని పవన్‌ను కోరారు.

More Telugu News