NDA: శివసేన లాజిక్... ఎన్డీయే కూటమి విజయానికి అదే సంకేతమట!

  • ఈ ఎన్నికల్లో శరద్ పవార్, మాయావతి పోటీ చేయట్లేదు
  • ఈ ప్రకటనే ఎన్డీఏ విజయానికి సంకేతం
  • ఎస్పీ-బీఎస్పీ కూటమి వ్యూహాలకు కాంగ్రెస్ గండికొడుతోంది

త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయమని భాగస్వామ్య పార్టీ శివసేన అంటోంది. తమ వాదనను బలపరిచేందుకు ఓ లాజికల్ కామెంట్ చేసింది. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించడమే తమ కూటమి విజయ సంకేతమని శివసేన భావిస్తోంది. ఈ విషయాన్ని శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది.

మాయావతి పోటీ నుంచి తప్పుకోవడానికీ ప్రియాంక గాంధీ రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కారణమని భావించింది. యూపీలో ప్రియాంక గాంధీ పర్యటనలకు, ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, ఈ విషయం మాయావతి శిబిరానికి నిద్రపట్టనివ్వడం లేదని వ్యాఖ్యానించింది. బీజేపీతో కన్నా కాంగ్రెస్ తోనే తమకు ఎక్కువ నష్టం వాటిల్లిందే ప్రమాదం ఉందని బీఎస్పీ భావిస్తోందని ’సామ్నా’ కథనం.

యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి వ్యూహాలకు కాంగ్రెస్ గండికొడుతోందని, కాంగ్రెస్, బీఎస్పీ ఓటు బ్యాంకు ఒకటేనని అభిప్రాయపడింది. ‘సామ్నా’ సంపాదకీయంలో శరద్ పవార్ పైనా విమర్శలు గుప్పించింది. ప్రతిపక్షాలన్నింటిని ఒకే తాటిపైకి తీసుకురావాలని చూస్తున్న శరద్ పవార్, తన పార్టీలోని నాయకులను, కుటుంబసభ్యులను ఏకాభిప్రాయానికి తేలేకపోయారని విమర్శించారు. 

More Telugu News