Rayapati: 'వైసీపీ... వైసీపీ' అంటూ నన్ను భ్రష్టు పట్టిస్తున్నారు: రాయపాటి

  • వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరతానన్నది అవాస్తవం
  • ఓ వర్గం మీడియా అభూతకల్పనే
  • 22న నరసరావుపేటలో నామినేషన్ వేస్తా
  • తిరుమలలో రాయపాటి సాంబశివరావు

తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని తెలుగుదేశం నేత రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఓ వర్గం మీడియా అభూత కల్పనలు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. గంటకోసారి 'వైసీపీ... వైసీపీ...' అంటూ టీవీ చానళ్లలలో స్క్రోలింగ్స్ వేస్తున్నారని, ఇలా చేసి తనను భ్రష్టు పట్టించవద్దని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాయపాటి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వాన్ని తను బలపరుస్తున్నానని, ఇక మీదటా అదే జరుగుతుందని చెప్పారు. నరసరావుపేట నుంచి లోక్ సభ అభ్యర్థిగా 22వ తేదీన నామినేషన్ వేయనున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం తనకుందని చెప్పారు.

More Telugu News