Uttar Pradesh: బీజేపీకి ప్రచారమే ముఖ్యం.. ఇందుకోసం ఏకంగా రూ.3,044 కోట్లు ఖర్చు పెట్టారు!: బీఎస్పీ చీఫ్ మాయావతి

  • ఈ నిధులతో పేద రాష్ట్రాల్లో విద్య, వైద్యం అందించవచ్చు
  • సమస్యల నుంచి ప్రజల దృష్టిని బీజేపీ మళ్లిస్తోంది
  • మోదీ ప్రభుత్వంపై మండిపడ్డ యూపీ మాజీ సీఎం

బీజేపీకి ప్రచారమే ముఖ్యమనీ, ప్రజా సంక్షేమం వారికి పట్టదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి విమర్శించారు. కేవలం ప్రకటనల కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూ.3,044 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఈ మొత్తం నగదుతో ఉత్తరప్రదేశ్ లాంటి వెనుకబడ్డ రాష్ట్రాల్లోని ప్రతీగ్రామంలో విద్య, వైద్య సౌకర్యాలు కల్పించవచ్చని వ్యాఖ్యానించారు. ఈరోజు ట్విట్టర్ లో మోదీపై మాయావతి విమర్శల వర్షం కురిపించారు.

ఎన్డీయే ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతోందని మండిపడ్డారు. అందులో భాగంగా పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టిని మళ్లిస్తోందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 80 స్థానాలకు గానూ బీఎస్పీ 38 స్థానాల్లో, ఎస్పీ 37 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరో మూడు స్థానాలను రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ)కి కేటాయించారు. మిగిలిన అమేథి(రాహుల్ గాంధీ), రాయ్ బరేలీ(సోనియా గాంధీ) సీట్లలో పోటీచేయకూడదని నిర్ణయించారు.

More Telugu News