Andhra Pradesh: మా ఊర్లోకి వచ్చి రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు.. తిక్కారెడ్డి గన్ మెనే కాల్పులు జరిపాడు!: వైసీపీ నేత బాలనాగిరెడ్డి

  • టీడీపీ నేతలు హింసను రెచ్చగొడుతున్నారు
  • కోడ్ అమల్లో ఉండగా జెండా ఆవిష్కరణ ఏంటి?
  • హింసా రాజకీయాలు మానుకుంటే మంచిది

తన స్వగ్రామం ఖగ్గల్ లోకి ప్రచారానికి వచ్చిన టీడీపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని వైసీపీ నేత, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా గ్రామంలో జెండా ఆవిష్కరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు గ్రామాల్లోకి వచ్చి హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని ఖగ్గల్ లో ఈరోజు టీడీపీ నేత తిక్కారెడ్డి-వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నేపథ్యంలో బాలనాగిరెడ్డి స్పందించారు.

తిక్కారెడ్డి కాలులోకి దూసుకుపోయిన బుల్లెట్ ఆయన గన్ మెన్ కాల్చిందేనని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. తమ దగ్గర ఎలాంటి తుపాకులు లేవని స్పష్టం చేశారు. ఒకవేళ తమదగ్గర తుపాకులు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని తేల్చిచెప్పారు.

తన గన్ మెన్ తో తిక్కారెడ్డే ఓపెన్ ఫైర్ చేయించాడని బాలనాగిరెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఇలాంటి హింసా రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.

More Telugu News