YS Viveka: వైఎస్ వివేకా... పులివెందుల పులిబిడ్డే!

  • అన్న చాటున ఉన్నా తనదైన శైలిలో రాజకీయాలు
  • మూడు దశాబ్దాల పాటు ప్రజాసేవలో
  • సమస్యలు పరిష్కరించడంలో ముందుండే వివేకా

వైఎస్ వివేకానందరెడ్డి... కడప జిల్లాలో ఈ పేరు తెలియని వారుండరు. వైఎస్ రాజారెడ్డి తనయుడిగా, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడిగా రాయలసీమ గడ్డపై ఆయన ఓ పులిబిడ్డలా ఎదిగారు. అన్న చాటున ఉన్నా తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు. అన్న వైఎస్ ఎంపీగా ఢిల్లీలో ఉన్నా, సీఎంగా హైదరాబాద్ లో ఉన్నా, జిల్లా రాజకీయం వివేకా కనుసన్నల్లోనే ఉండేది.

1950 ఆగస్టు 8న పులివెందులలో జన్మించిన వివేకానందరెడ్డి, ఎంపీగా రెండు సార్లు, ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించి, మూడు దశాబ్దాలపాటు ప్రజాసేవ చేశారు. 1999లో కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 90 వేల భారీ మెజార్టీతో ఎంపీగా ఎన్నికైన వివేకా, 2004లో 1.10 లక్షల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు.  అంతకుముందు 1989, 1994లో పులివెందుల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగానూ గెలిచారు. 2009 సెప్టెంబర్ లో మండలి సభ్యుడిగానూ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు.

కాగా, తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైఎస్ వివేకా ముందుండేవారు. నియోజకవర్గ ప్రజలతో చాలా దగ్గరగా ఉండేవారు. తన ఇంటికి ఎవరు వచ్చినా, ఆప్యాయంగా పలకరించి, వారు ఎందుకు వచ్చారో తెలుసుకుని, ఆ పని జరిగేలా చూసేవారు. తన సోదరుడు సీఎంగా ఉన్నప్పటికీ, ప్రతి మంత్రి చాంబర్ వద్దకూ స్వయంగా వెళ్లి, తన వద్దకు వచ్చిన వివిధ రకాల అర్జీలను అక్కడున్న వారికి ఇచ్చి, సమస్యల పరిష్కారానికి కృషి చేశారన్న పేరు వివేకాకు ఉంది.

పులివెందుల పులిబిడ్డగా వైఎస్ రాజశేఖరరెడ్డిని పిలుచుకుంటున్నా, అసలు పులిబిడ్డ వైఎస్ వివేకాయేనని, ఆయన వ్యూహాల కారణంగానే కడప జిల్లాలో ఆనాడు కాంగ్రెస్, ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టును నిలుపుకుని ఉన్నాయని ఆయన అభిమానులు అంటున్నారు. ఆయన వివాదరహితుడని, కుటుంబానికి ఫ్యాక్షన్ నేపథ్యమున్నా, వివేకా ఎన్నడూ దాని జోలికి పోయిన వ్యక్తి కాదని గుర్తు చేసుకుంటున్నారు. 

More Telugu News