Pakistan: పాత్రికేయుల బాలాకోట్‌ సందర్శనను మూడోసారి అడ్డుకున్న పాకిస్థాన్‌

  • మదర్సా, చుట్టుపక్కల ప్రాంతాల సందర్శనకు వెళ్లిన రాయటర్స్‌ సంస్థ ప్రతినిధులు
  • ఎవరినీ వెళ్లనీయడం లేదని చెప్పిన అధికారులు
  • సంస్థ ప్రతినిధుల మూడో ప్రయత్నం విఫలం

జమ్ముకశ్మీర్‌ నియంత్రణ రేఖకు అవతల పాకిస్థాన్‌ ఈశాన్య ప్రాంతంలో ఉన్న బాలాకోట్‌ సందర్శనకు వెళ్లిన రాయటర్స్‌ సంస్థ ప్రతినిధులను పాకిస్థాన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఇటీవల భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలకు బాలాకోట్‌ ప్రాంతమే కీలకంగా మారిన విషయం తెలిసిందే. పుల్వామాలో ఉగ్రదాడి జరగడం, ఆ తర్వాత బాలకోట్‌ పట్టణ సమీపంలోని పర్వత ప్రాంతాల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన అతి పెద్ద శిక్షణ శిబిరంపై భారత్‌ వైమానిక దళం దాడులు జరపడం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ప్రాంతంలోని మదర్సాను, ఆ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించేందుకు రాయటర్స్‌ సంస్థ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.

కానీ పాకిస్థాన్‌ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. గడచిన తొమ్మిది రోజుల వ్యవధిలో పాత్రికేయులు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్రయత్నించడం ఇది మూడోసారి. భద్రతాపరమైన సమస్యల కారణంగానే ఈ ప్రాంతంలోకి ఎవరినీ వెళ్లనీయడం లేదని పాకిస్థాన్‌ అధికారులు స్పష్టం చేశారు.

వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో పాటు ఇతర కారణాల వల్ల పాక్‌ సైనిక విభాగం అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లేందుకు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని ఈ సందర్శంగా పాత్రికేయులకు తెలియజేశారు. మరికొన్ని రోజుల పాటు ఆ ప్రాంతాన్ని సందర్శించడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశారు.

More Telugu News