Andhra Pradesh: టీడీపీకి జయసుధ గుడ్ బై.. నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక!

  • ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు జగన్ ఇంటికి
  • వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ ఎమ్మెల్యే
  • జయసుధ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు జోరందుకున్నాయి. తాజాగా ప్రముఖ సినీనటి జయసుధ ఈరోజు టీడీపీకి రాజీనామా చేయనున్నారు. అనంతరం వైసీపీలో ఆమె చేరనున్నారు. గతకొంత కాలంగా టీడీపీ కార్యక్రమాలకు జయసుధ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు ఆ పార్టీ నేతలకు ఆమె వర్తమానం పంపారు.

దీంతో ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు జగన్ కు తెలపగా, ‘మన పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిద్దాం’ అని వైసీపీ అధినేత చెప్పారు. దీంతో వైసీపీలో జయసుధ చేరికకు మార్గం సుగమం అయింది. కాగా, ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు జయసుధ జగన్ నివాసానికి చేరుకుంటారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరుతారని పేర్కొన్నాయి. జయసుధ గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు.

More Telugu News