India: భారత్ ను దెబ్బతీయడానికి అల్ ఖైదాలు, ఇమ్రాన్ ఖాన్ లు అవసరంలేదు, మమత ఒక్కరు చాలు: బెంగాల్ బీజేపీ చీఫ్ సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై సెటైర్ల జడివాన కురిపించారు. మంగళవారం నాడు కోల్ కతాలో ఆయన మాట్లాడుతూ, బాలాకోట్ దాడులపై సందేహాలు వెలిబుచ్చుతున్నారంటూ మమతపై మండిపడ్డారు. అనంతరం తనదైన శైలిలో వ్యంగ్యం ప్రదర్శించారు. మమతా బెనర్జీ పాకిస్థాన్ నేతలు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారని ఆరోపించిన ఘోష్... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కంటే భారత్ కు మమతతోనే ఎక్కువ ప్రమాదం ఉందన్నారు.

"పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకోవాలని యావత్ జాతి ముక్తకంఠంతో నినదిస్తుంటే మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఆధారాలు కావాలంటారు. పాకిస్థాన్ పై దాడులు చేయడం ఎందుకంటారు. పాకిస్థాన్ ప్రధానమంత్రి ఆలపిస్తున్న రాగాన్నే ఆమె కూడా పాడుతున్నారు. నాకు తెలిసి భారత్ ను దెబ్బతీయడానికి ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్లు అవసరంలేదు, మమతా బెనర్జీ ఒక్కరు చాలు! తృణమూల్ కాంగ్రెస్ లాంటి ఘనత వహించిన పార్టీ ఇక్కడ ఉండగా సిమీ, జమాతుల్ ముజాహిదిన్, అల్ ఖైదా సంస్థలు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు" అంటూ వ్యంగ్యంతో తీవ్ర విమర్శలు చేశారు.
Go Back to Shorts
India
Pakistan

More Telugu News