rape: స్నేహితుడి ప్రియురాలిపై యువకుడి అత్యాచారం.. 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన కోర్టు!

  • తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘటన
  • యాక్సిడెంట్ అయిందటూ యువతికి అబద్ధం
  • నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం

స్నేహితుడు అనే పదానికే కళంకం తెచ్చేలా ఓ వ్యక్తి వ్యవహరించాడు. తన స్నేహితుడికి యాక్సిడెంట్ అయిందని అతని ప్రియురాలికి అబద్ధం చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే సదరు నీచుడి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. తాజాగా ఈ కేసును విచారించిన కోర్టు సదరు వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటుచేసుకుంది.

కడలూరులోని పెరియకోటమూలై ప్రాంతానికి చెందిన సత్యమూర్తి, విజయేంద్రన్ స్నేహితులు. అయితే విజయేంద్రన్ ప్రియురాలిపై సత్యమూర్తి కన్నేశాడు. ఈ క్రమంలో 2017 మార్చి 17న సదరు యువతికి ఫోన్ చేసిన సత్యమూర్తి.. విజయేంద్రన్ కు యాక్సిడెంట్ అయిందనీ, కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని అబద్ధం చెప్పాడు. విజయేంద్రన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అన్నాడు. తాను అక్కడికే బైక్ పై వెళుతున్నాననీ, తనతో రావాలని కోరాడు.

దీంతో యువతి అతని బైక్ పై వెంటనే బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో బైక్ పై దారి మళ్లించిన సత్యమూర్తి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అతని బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కడలూరు మహిళా కోర్టు.. సత్యమూర్తికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

More Telugu News