యూపీలో ఎస్పీ, బీఎస్పీకి షాక్.. పెద్దఎత్తున బీజేపీలో చేరిన నేతలు

  • ఎన్నికలకు ముందు ఎస్పీ, బీఎస్పీలకు ఎదురుదెబ్బ
  • మాజీ మంత్రి సహా పలువురు కమల దళంలోకి
  • బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్న ఆ పార్టీ యూపీ చీఫ్
లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో ఒక్కటైన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)- సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లకు భారీ ఎదురుదెబ్బ తగలింది. ఈ రెండు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో యూపీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే సమక్షంలో  ఈ చేరికలు కొనసాగాయి.

  బీఎస్పీ మాజీ నేత, మాజీ మంత్రి ముకుల్ ఉపాధ్యాయ్, రాంహెట్ భారతి, జోనల్ కో ఆర్డినేటర్ ధ్రువ్ పరాశన్‌తోపాటు ఎస్పీ మాజీ ఎమ్మెల్యే బీనా భరద్వాజ్  సహా పలువురు నేతలు బీజేపీలో చేరినట్టు మహేంద్రనాథ్ పాండే తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల్లో బీజేపీపై విశ్వాసం రోజురోజుకు పెరుగుతోందని పాండే పేర్కొన్నారు. ఓడిపోతామన్న భయంతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నాయని విమర్శించారు.
Go Back to Shorts
Bahujan Samaj Party
Samajwadi Party
BJP
Uttar Pradesh
Narendra Modi
Yogi Adityanath

More Telugu News