డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి కేటీఆర్‌ చర్చలు...మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌లతో భేటీ

  • తొలుత సీఎల్పీ కార్యాలయంలో భట్టిని కలిసిన కేటీఆర్‌
  • డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి
  • భట్టి పిలుపుతో వచ్చిన ఉత్తమ్‌కుమార్‌తోనూ మంతనాలు
తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవంగా పూర్తి చేసేందుకు టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) చర్చలు మొదలుపెట్టారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్‌ విడుదలకానున్న విషయం తెలిసిందే. ఈ పదవి కోసం టీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ పేరును ఖరారు చేసింది. దీంతో పద్మారావును ఏకగ్రీవం చేసేందుకు రంగంలోకి దిగిన కేటీఆర్‌ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ నాయకులతో ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. తొలుత ఆయన సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కను అసెంబ్లీ లాబీలోని కార్యాలయంలో కలిసి మంతనాలు జరిపారు. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని కోరినట్లు సమాచారం.

వీరిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలోనే మాజీ మంత్రి పద్మారావు, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ లు కూడా వచ్చి చర్చల్లో పాల్గొని వెళ్లారు. కేటీఆర్‌ విజ్ఞప్తిని విన్న భట్టివిక్రమార్క పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో మాట్లాడి చెబుతానని అనడం, ఆ సమాచారం అందుకున్న ఉత్తమ్‌కుమార్‌ సీఎల్పీ కార్యాలయానికి రావడంతో ముగ్గురు నేతలు ఎన్నిక అంశంపై కలిసి చర్చించారు. తమ నిర్ణయం తర్వాత చెబుతామని మల్లు, ఉత్తమ్‌లు స్పష్టం చేసినట్లు సమాచారం.
Go Back to Shorts
KTR
Mallu Bhatti Vikramarka
Uttam Kumar Reddy
dy.speaker

More Telugu News