Andhra Pradesh: మాట వినడం లేదట.. నాలుగేళ్ల చిన్నారి తొడలపై వాతలు పెట్టిన మారుడు తండ్రి

  • రాజమహేంద్రవరంలో ఘటన
  • వివాహితతో సహజీవనం
  • చిన్నారికి చిత్రహింసలు

చుట్టుపక్కల వారి ఫిర్యాదుతో నాలుగేళ్ల చిన్నారిపై మారు తండ్రి చేస్తున్న దాష్టీకం బయటకొచ్చింది. తాగొచ్చి చిన్నారిని చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా వాతలు పెట్టిన అతడి రాక్షసత్వం చూసి పోలీసులే విస్తుపోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటన కన్నీళ్లు పెట్టించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. రాజవొమ్మంగి మండలంలోని కిండ్ర గ్రామానికి చెందిన సుజాత నాలుగేళ్ల కుమార్తెతో కలిసి ఉంటోంది. భర్త చనిపోయిన ఆమెతో అదే ప్రాంతానికి చెందిన బరకత్ అలీ సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల సుజాతను రాజమహేంద్రవరం తీసుకొచ్చి ఇన్నీసుపేటలో మకాం పెట్టాడు. ఓ సెల్‌ఫోన్ దుకాణంలో పనిచేసే బరకత్ అలీ రోజూ తాగొచ్చి చిన్నారిని చిత్రహింసలకు గురిచేసేవాడు. చిన్నారి పెట్టే కేకలు చుట్టుపక్కల వారి హృదయాలను కలచివేసేవి.

గురువారం రాత్రి కూడా చిన్నారి కేకలు పెడుతుండడంతో ఊరుకోలేకపోయిన చుట్టుపక్కలవారు వెంటనే చైల్డ్ లై‌న్ ప్రతినిధి బి.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ప్రతినిధులు పోలీసుల సహకారంతో బాలికను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ వారికి బాలిక తన తొడలపై పెట్టిన వాతలను చూపించింది. రోజూ తనను చిత్రహింసలు పెడుతుంటాడని బాలిక చెప్పింది. చికిత్స నిమిత్తం బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బరకత్ అలీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News