BJP: రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నాయకులు శిఖండుల్లా అడ్డుపడుతున్నారు: మంత్రి దేవినేని

  • అమిత్‌ షా మాటలు విడ్డూరంగా ఉన్నాయి
  • మీరిచ్చిన రూ.10 లక్షల కోట్లు ఎక్కడని ప్రశ్న
  • మట్టి, నీళ్లు మాత్రమే ఇచ్చారని విమర్శ

రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నాయకులు శిఖండుల్లా తయారయ్యారని, అడుగడుగునా అడ్డుపడుతున్నారని ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటు విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు ఇచ్చామంటూ ఆ పార్టీ చీఫ్‌ అమిత్‌ షా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఇలా బాధ్యతారహితంగా మాట్లాడడం తగదన్నారు.

రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇచ్చింది పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లే అని ఎద్దేవా చేశారు. పోలవరం నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులే ఇవ్వని కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు ఇచ్చామని ఎలా చెబుతోందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సంస్థలే అవార్డు ఇస్తుంటే బీజేపీ నేతలు మాత్రం అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని విపక్షం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సాగిలపడిపోయిందని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పైగా బెదిరించి పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

More Telugu News