Mallareddy: జయరామ్ హత్య కేసులో ఇరుక్కున్న ఏసీపీ... రాకేశ్ మిస్డ్ కాల్ చూసి ఫోన్ చేశానన్న మల్లారెడ్డి!

  • హత్య గురించి నాకు తెలియదు
  • మిత్రుల మధ్య గొడవని చెప్పాడు
  • తానే ఫోన్ చేశానన్న మల్లారెడ్డి

తనకు చిగురుపాటి జయరామ్ హత్యకు గురైన విషయం తెలియదని, రాకేశ్ నుంచి మిస్డ్ కాల్ చూసి, తానే ఫోన్ చేశానని, అదే తన తప్పయిపోయిందని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, పోలీసు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. జయరామ్ హత్య తరువాత కేసు నుంచి ఎలా తప్పించుకోవాలన్న అంశంపై రాకేశ్ రెడ్డికి మల్లారెడ్డి సలహాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

 ఈ నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ మల్లారెడ్డిని అధికారులు విచారించారు. స్నేహితుల మధ్య చిన్న గొడవ జరిగిందని మాత్రమే రాకేశ్ తనకు చెప్పాడని, జయరామ్ హత్య గురించి తనకు తెలియదని మల్లారెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది. జయరామ్ హత్య గురించి మీడియాలో వార్తలు వచ్చిన తరువాతనే తనకు తెలిసిందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, ఈ కేసులో మల్లారెడ్డితో పాటు సీఐలు శ్రీనివాస్, రాంబాబులను కూడా పోలీసు అధికారులు విచారించారు.

More Telugu News