Congress: టీడీపీలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు

  • ఈ నెల 28న టీడీపీలో చేరనున్న కోట్ల
  • కోడుమూరులో లక్షమందితో భారీ బహిరంగ సభ
  • మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిక విషయంలో ఊహాగానాలకు తెరపడింది. ఈ నెల 28న ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గతేడాది రైతు మహాసభ జరిగిన కోడుమూరులోని ఆర్ఆర్‌బీ అతిథిగృహం సమీపంలో ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభకు కనీసం లక్షమందిని తరలించాలని యోచిస్తున్నారు.

టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సూర్యప్రకాశ్ రెడ్డి మరో రెండుమూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇక టీడీపీలో చేరబోతున్న ఆయన వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఆలూరు, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా తమకు కేటాయించాలని కోట్ల కుటుంబం కోరినట్టు సమాచారం.

అయితే, డోన్ నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని కేఈ కుటుంబం కోరుతున్న నేపథ్యంలో ఆలూరు నుంచి కోట్ల సుజాతమ్మ పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే, సూర్యప్రకాశ్ రెడ్డి కుమారుడు రాఘవేంద్రరెడ్డికి ఏదైనా పదవి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది.

More Telugu News