AMB Cinemas: వివాదంలో చిక్కుకున్న మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్... నోటీసులు జారీ!

  • థియేటర్లపై జీఎస్టీని తగ్గించిన కేంద్రం
  • ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించని ఏఎంబీ
  • నోటీసులు జారీ చేసిన జీఎస్టీ కౌన్సిల్

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఇటీవల అందుబాటులోకి వచ్చిన మహేశ్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ థియేటర్ లో టికెట్ రేట్ల విషయంలో నిబంధనలను పాటించడం లేదని, జీఎస్టీని కేంద్రం తగ్గించినా, ఆ మేరకు ప్రయోజనాలను ప్రేక్షకులకు అందించలేదని ఆరోపిస్తూ, షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

వాస్తవానికి సాధారణ థియేటర్ తో పోలిస్తే, ఏయంబీ సినిమాస్‌ లో సినిమా చూడాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సివుంటుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో రూ. 100కు పైగా టికెట్ ధర ఉన్న థియేటర్లలో జీఎస్టీని 28 నుంచి 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే, ఏఎంబీ సినిమాస్ లో మాత్రం ధరలను తగ్గించలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ వింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఏయంబీ సినిమాస్‌ భాగస్వామి ఏసియన్ గ్రూప్ ప్రతినిధి సునీల్‌, అధికారులు తనిఖీలు చేసిన విషయం వాస్తవమేనని, అయితే, నోటీసులు మాత్రం ఇవ్వలేదని అన్నట్టు సమాచారం.

More Telugu News