Jagan: లోటస్ పాండ్ లో జగన్ తో కేంద్ర మాజీ మంత్రి కృపారాణి చర్చలు!

  • జగన్ ఇంటికి వచ్చిన కిల్లి దంపతులు
  • హోదా వైసీపీతోనే సాధ్యమన్న కిల్లి
  • కాంగ్రెస్ కు రాజీనామా చేశానని వెల్లడి

గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. మేడా మల్లికార్జున్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమోహన్, పండుల రవీంద్రబాబు తదితరులు ఇప్పటికే 'ఫ్యాన్' కిందకు చేరిపోగా, నేడు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం హైదరాబాద్, లోటస్ పాండ్ లోని తన నివాసానికి వచ్చిన కిల్లి దంపతులను ఆహ్వానించిన జగన్, వారితో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. అనంతరం కృపారాణి మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని అన్నారు. ఈ నెల 28న అమరావతిలో జరిగే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నానని చెప్పారు. ఏపీ అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా అది వైఎస్ జగన్ తోనే సాధ్యమని నమ్మే పార్టీలో చేరుతున్నానని, జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తానని అన్నారు.

More Telugu News