mamata banerjee: పుల్వామా ఉగ్రదాడి.. మోదీ ప్రభుత్వంపై మమత సంచలన ఆరోపణలు

  • ఐదేళ్లలో జరగని దాడి ఎన్నికల ముందు ఎందుకు జరిగింది?
  • సైనికులను వాయుమార్గంలో ఎందుకు తరలించలేదు?
  • చూస్తుంటే ఏదో మతలబు ఉందనిపిస్తోంది

పుల్వామా ఉగ్రదాడి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రదాడి గురించి మోదీ సర్కారుకు ముందే తెలుసని, ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందే ఈ దాడి ఎందుకు జరిగిందని ప్రశ్నించిన మమత.. రాజకీయ ప్రయోజనాల కోసం పాక్‌పై పరోక్ష యుద్ధానికి కేంద్రం తెరలేపిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ మార్క్ రాజకీయానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ అని విరుచుకుపడ్డారు.

పుల్వామా దాడి కేంద్రానికి తెలిసే జరిగిందని చెప్పేందుకు తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని మమత పేర్కొన్నారు. నిఘా నివేదికలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉగ్రవాదులను భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌పై ఇన్నాళ్లూ ఎందుకు మౌనం వహించారని మోదీని నిలదీశారు.

ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రధాని జవాన్లను వాయు మార్గంలో ఎందుకు తరలించలేదని సూటిగా ప్రశ్నించారు. ఐదేళ్లుగా జరగనిది ఎన్నికలకు కొన్ని రోజుల ముందే జరిగితే ఏమని అర్థం చేసుకోవాలన్నారు. ఇందులో ఏదో మతలబు ఉండే ఉంటుందని మమత అనుమానం వ్యక్తం చేశారు.

More Telugu News