Andhra Pradesh: ఎంపీ శివప్రసాద్ కు ప్రధాని మోదీ ప్రశంసలు.. ఘాటుగా స్పందించిన శివప్రసాద్!

  • శివప్రసాద్ చాలా మంచి నటుడన్న మోదీ
  • ప్రధాని ప్రశంసలు అవసరంలేదన్న శివప్రసాద్
  • ప్రజలకు మేలు జరిగితే చాలని వ్యాఖ్య

పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యుడు శివప్రసాద్ నిరసన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆయన రోజుకో వేషంతో ఇతర టీడీపీ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో లోక్ సభ సమావేశాల ముగింపు సందర్భంగా ప్రధాని మోదీ శివప్రసాద్ పై ప్రశంసలు కురిపించారు. శివప్రసాద్ చాలా మంచి నటుడని మోదీ కితాబిచ్చారు. చిత్రవిచిత్ర వేషధారణతో ఆయన పార్లమెంటులో అందరిని నవ్వించేవారని అన్నారు. తాను సభకు ఎన్ని టెన్షన్లతో వచ్చినా.. శివప్రసాద్ ను చూడగానే అన్నీ మరిచిపోతానని వ్యాఖ్యానించారు.

కాగా, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై శివప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ‘మోదీ నాకు అద్భుతమైన ప్రశంస ఇచ్చారు. అందరిని ఎగతాళి చేసినట్లు కళ గురించి మాట్లాడలేకపోయాడు. మోదీ ప్రశంస నాకు అవసరం లేదు. ఆయన వ్యంగ్యంగా మాట్లాడినా.. ఎలా మాట్లాడినా నాకు ప్రశంస అవసరం లేదు. చంద్రబాబు పోరాటానికి మద్దతుగా హోదా కోసం నా వంతు కృషి చేశా. వేషధారణలో గిన్నిస్ రికార్డు నాకు అవసరం లేదు. ప్రజలకు మేలు జరిగి వారి ప్రేమ ఉంటే చాలు’ అని శివప్రసాద్‌ స్పష్టం చేశారు.

More Telugu News