Prakasam District: పార్టీకి కష్టకాలంలోనే నేను గుర్తుకు వస్తుంటాను: కరణం బలరాం ఆసక్తికర వ్యాఖ్యలు

  • పార్టీ ఆదేశిస్తే చీరాల నుంచి పోటీకి సిద్ధం
  • పార్టీ వీడుతూ ఆమంచి చేసిన వ్యాఖ్యలు సరికాదు
  • ఆయన లేకుంటే పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు

పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడే అధినాయకులకు తాను గుర్తుకు వస్తుంటానని టీడీపీ ఎమ్మెల్సీ కరణం బలరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయినా వారి ఆదేశాలు శిరసావహిస్తానని, రానున్న ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే చీరాల నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం చీరాల రాజకీయాలు రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆమంచి నిష్క్రమణతో టీడీపీ తరపున ఈ స్థానం ఆశిస్తున్న వారు ఒక్కొక్కరే బయటపడుతున్నారు. ఈ నేపథ్యంలో బలరాం ఓ టీవీ చానెల్‌ తో మాట్లాడుతూ చీరాల టికెట్‌ ను బీసీలకు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు చెప్పారు. ఒకవేళ తనను ఆదేశించినా పోటీ చేస్తానన్నారు.

పార్టీ వీడుతూ ఆమంచి చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని, ఆయన లేకపోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టం ఏమీలేదని అన్నారు. కాగా, గత కొంతకాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా బుధవారం నియోజకవర్గంలో తన అనుచరులతో ర్యాలీ నిర్వహించి తానూ బరిలో ఉన్నానని చెప్పకనే చెప్పారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన సునీత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారని సమాచారం.

More Telugu News